అమెరికాలో మరోమారు పేలిన తుపాకీ... ముగ్గురి మృతి
అగ్రరాజ్యం అమెరికాలో మరోమారు తుపాకీ పేలింది. ఇందులో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. నార్త్ కరోలినాలోని అమెరికన్ ఫిష్ కంపెనీ రెస్టరెంట్ సమీపంలో శనివారం రాత్రి (అమెరికా కాలమానం ప్రకారం) కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఇందులో ముగ్గురు మృతి చెందగా.. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు.
అధికారుల వివరాల ప్రకారం.. గుర్తు తెలియని బోటు నార్త్ కరోలినాలోని సౌత్ పోర్ట్ యాచ్ బేసిన్లో ఉన్న అమెరికన్ ఫిష్ కంపెనీ రెస్టరంట్ వద్దకు వచ్చింది. బోటులోని వ్యక్తి ఒక్కసారిగా రెస్టరెంట్పైకి కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. పలువురికి గాయాలైనట్లు సమాచారం.
కాల్పుల అనంతరం దుండగుడు అదే బోటులో పారిపోయినట్లు అధికారులు పేర్కొన్నారు. నిందితుడి కోసం గాలింపు చేపడుతున్నామని.. దాడికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు. మృతులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.