లాలూ కుటుంబంలో చిచ్చుపెట్టిన బీహార్ అసెంబ్లీ ఫలితాలు.. ప్యామిలీతో కటీఫ్
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో చిచ్చుపెట్టాయి. తాను ఆర్జేడీ పార్టీ నుంచి, కుటుంబం నుంచి బయటకు వచ్చేసినట్లు ప్రకటించిన ఆయన కుమార్తె రోహిణీ ఆచార్య తాజాగా తన సోదరుడు తేజస్వీపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన, ఆయన సహాయకులే తనను కుటుంబం నుంచి బయటకు పంపించినట్లు ఆదివారం పేర్కొన్నారు. ఈ మేరకు తీవ్ర ఆరోపణలు చేస్తూ ఆమె ఎక్స్లో వరుస పోస్టులు చేశారు.
'నిన్న ఓ కుమార్తె, సోదరి, గృహిణి, తల్లి అవమానం ఎదుర్కొన్నారు. అసభ్యకరంగా తిట్టారు. కొట్టేందుకు చెప్పులు ఎత్తారు. నేను నా ఆత్మగౌరవం విషయంలో రాజీపడలేదు. సత్యాన్ని వాళ్లకు లొంగనీయలేదు. కేవలం అందుకోసమే అవమానాలను ఎదుర్కొన్నా. ఏడుస్తున్న సోదరిని, తల్లిదండ్రులను నిన్న ఓ కూతురు నిస్సహాయతతో వదిలివెళ్లింది. మా అమ్మ ఇంటిని వదిలేసి వెళ్లిపోవాల్సి వచ్చింది. నన్ను అనాథను చేశారు. మీరు ఎప్పటికీ నా మార్గాన్ని అనుసరించవద్దు. ఏ కుటుంబానికి రోహిణీ వంటి కుమార్తె, సోదరి ఉండకూడదని కోరుకుంటున్నా' అని తొలుత భావోద్వేగపూరిత పోస్టు చేశారు.
'నిన్న నన్ను మురికిదానిని అని తిట్టారు. నా మురికి కిడ్నీనే తండ్రికి మార్పిడి చేయించాను. రూ.కోట్లు, టికెట్లు తీసుకొన్నాకే మురికి కిడ్నీ ఇచ్చాను. పెళ్లైన కూతుళ్లు, సోదరీమణులకు ఓ విషయం చెబుతున్నాను. మీ పుట్టింట్లో కుమారుడు లేదా అన్నయ్య ఉంటే పొరబాటున కూడా దేవుడు వంటి మీ తండ్రిని కాపాడకండి. ఆ ఇంటి కొడుకు అయిన మీ అన్నయ్య లేదా అతడి హర్యానా స్నేహితుడి కిడ్నీని ఇవ్వాలని చెప్పండి. మీరు మీ కుటుంబాలను చూసుకోండి.
మీ తల్లిదండ్రులను పట్టించుకోకుండా మీ పిల్లలను, అత్తమామలను చూసుకోండి. కేవలం మీ గురించే ఆలోచించుకోండి. నా నుంచి చాలా పెద్ద తప్పు జరిగింది. నేను నా కుటుంబాన్ని, నా ముగ్గురు పిల్లలను చూసుకోలేదు. కిడ్నీ ఇచ్చే సమయంలో నా భర్త, అత్తమామల అనుమతి తీసుకోలేదు. నా దేవుడు వంటి తండ్రిని కాపాడుకొనేందుకు ఆ పనిచేశా. ఇప్పుడు మురికిదానిని అని మాటలు పడుతున్నా. మీరంతా నాలాంటి తప్పు ఎప్పటికీ చేయకూడదు. రోహిణీ వంటి కుమార్తె ఏ ఇంట్లోనూ ఉండకూడదు' అంటూ మరో పోస్ట్ చేశారు.