అన్నప్రసాదం కోసం నాణ్యమైన బియ్యం మాత్రమే సరఫరా చేయాలి.. వెంకయ్య
అన్నప్రసాదం కోసం నాణ్యమైన బియ్యం మాత్రమే సరఫరా చేయాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రైస్ మిల్లర్లను టిటిడి అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి కోరారు. బియ్యం నాణ్యత నేరుగా లక్షలాది మంది భక్తులకు అందించే రుచిని ప్రభావితం చేస్తుందని ఉద్ఘాటించారు.
గురువారం తిరుమలలో రెండు రాష్ట్రాల రైస్మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో అదనపు ఈఓ నిర్దేశించిన ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని చెప్పారు. అన్నప్రసాదం కోసం వండిన నమూనాలను రుచి చూసిన తర్వాతనే నాణ్యత ఉండేలా చూడాలని ఆయన ఆదేశించారు.
తిరుమల, తిరుచానూరు, స్థానిక ఆలయాల్లో రోజుకు దాదాపు 20 వేల కిలోల బియ్యం అవసరమవుతుండగా, కొనుగోళ్లను క్రమబద్ధీకరించేందుకు నెలవారీ సరఫరా షెడ్యూల్ను సమర్పించాలని మిల్లర్లను ఆదేశించారు. ప్రస్తుత ఏపీ-తెలంగాణ సరఫరా నిష్పత్తి 60:40గా ఉంది.
ప్రతి నెలా మిల్లర్లతో వర్చువల్ మీటింగ్లు నిర్వహించి, ఫీడ్బ్యాక్ను పంచుకోవాలని, నెలవారీ అన్నప్రసాదం నాణ్యత నివేదికలను-శ్రీవారి సేవకుల ద్వారా సేకరించి.. అభివృద్ధి కోసం అసోసియేషన్లకు పంపాలని అధికారులకు చెప్పారు.
హైదరాబాద్కు చెందిన గుబ్బా కోల్డ్ స్టోరేజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రతినిధులు అధునాతన స్టోరేజీ ఎంపికలను అందించారు.
టీటీడీ కోసం అధునాతన కోల్డ్ స్టోరేజీ యూనిట్ను ఏర్పాటు చేయడానికి అవసరమైన స్టోరేజీ సొల్యూషన్లను పరిశీలించి, రాష్ట్ర గిడ్డంగుల శాఖ, ఎఫ్ఎస్ఎస్ఏఐ, సీఎఫ్టీఆర్ఐలను భాగస్వాములను చేయాలని అదనపు ఈవో అధికారులను కోరారు.