రూ.5కే షర్ట్ ఆఫర్ ... దుకాణానికి పోటెత్తిన ప్రజలు
తెలంగాణ రాష్ట్రంలోని నారాయణపేట జిల్లా కొడంగల్ పట్టణంలోని ఓవస్త్ర దుకాణం సంచలన ఆఫర్ ప్రకటించింది. దీంతో ఆ దుకాణానికి ప్రజలు పోటెత్తారు. కేవలం రూ.5కే చొక్కా అందిస్తామని ప్రకటించడంతో దుకాణం ముందు బారులు తీరారు. అయితే, ఈ ఆఫర్ అందరికీ వర్తించదని దుకాణ యజమాని తెలిపారు. కొడంగల్ బస్టాండు వద్ద ఉన్న వస్త్ర దుకాణ యజమాని తన ఇన్స్టాగ్రామ్ ఫోలోవర్ల కోసం ప్రత్యేకంగా ప్రకటించినట్టు వెల్లడించారు.
దీంతో తెల్లవారుజాము నుంచే యువకులు భారీ సంఖ్యలో దుకాణం వద్దకు చేరుకున్నారు. వందలాది మంది దాదాపు 2 గంటల పాటు దుకాణం ముందు వరుసలో నిల్చొన్నారు. జనం అధిక సంఖ్యలో రావడంతో దుకాణం తెరవడం యజమానికి కష్టతరంగా మారింది. చివరకు దుకాణం తెరిచి, వచ్చిన వారికి దుస్తులను అందించారు.